రండి..ఓటేద్దాం..!
- మనం వేసే ఓటే.. రేపటి మన భవిష్యత్తు..!
- ఇంటి నుంచి బయటకు రండి.. మంచి నాయకుడినిఎన్నుకోండి
- ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి
ఓటు వేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని బలపరుద్దాం. ఇంటి నుంచి బయటకు రండి.. ఓటు హక్కును వినియోగించుకోండి. మంచి నాయకుడిని ఎన్నుకుంటేనే భవిత. లేదంటే ఐదేండ్ల పాటు అంధకారమే. నీ సత్తా నిరూపించుకునే సమయం వచ్చినప్పుడు మిన్నకుండి తదనంతరం నిందించే కన్నా.. ముందే మేల్కోండి. సమాజంలో మార్పుతో కూడిన అభివృద్ధి సాధించాలంటే పౌరులు యుద్ధాలు, త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు.
చేయాల్సిందల్లా ఒక్కటే.. పోలింగ్ రోజు నీకున్న హక్కు సద్వినియోగం చేసుకోవడమే. నీ కర్తవ్యం నెరవేర్చాల్సిన రోజున బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే.. సమాజమే కాదు.. దేశం కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ కొన్ని నిమిషాలు వెచ్చించి పౌరులిచ్చే తీర్పు.. రాబోయే ఐదేళ్ల పాటు జీవన స్థితిగతుల్ని ప్రభావితం చేస్తుంది. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు నిరుపయోగం కాకుండా అందరూ సద్వినియోగం చేసుకుంటేనే ప్రజాస్వామ్యం ప్రకాశిస్తుంది. ఆ క్షణాలు కొన్ని గంటల్లో మన ముందుకు రాబోతున్నాయి. రాష్ట్ర, దేశ భవిష్యత్తును మార్చే మీ ఓటు వేయడానికి అందరూ కలిసి రండి.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి.