ప్రతి సంవత్సరం 750 కిలోల బంగారం ఉత్పత్తి! దేశంలోనే తొలి ప్రైవేటు బంగారు గని ఏపీలో సిద్ధం.

  • రూ. 200 కోట్ల పెట్టుబడితో డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.
  • 250 ఎకరాల భూసేకరణ పూర్తయింది.
  • ప్లాంటు నిర్మాణం 60 శాతం పూర్తి అయ్యింది.
  • ఇప్పటికే రోజుకు ఒక కిలో బంగారం ఉత్పత్తి మొదలైంది.

దేశంలో తొలి ప్రైవేటు బంగారు గని ఆంధ్రప్రదేశ్‌లో సిద్ధమవుతోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో ఈ బంగారు గనిని డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తోంది.

సుమారు 250 ఎకరాల భూసేకరణతో, భూగర్భం నుంచి బంగారం వెలికితీయడానికి రూ. 200 కోట్ల పెట్టుబడితో భారీ ప్లాంట్ నిర్మిస్తోంది. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయి. పైలట్ స్థాయిలో రోజుకు ఒక కిలో బంగారం ఉత్పత్తి జరుగుతోందని సంస్థ ఎండీ హనుమ ప్రసాద్ తెలిపారు. ఈ ఏడాది చివరికి పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభమైతే, ఏటా 750 కిలోల బంగారం ఉత్పత్తి అవుతుందని చెప్పారు.

ఇక చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కొన్ని బంగారం గనులను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ) ఆసక్తి చూపుతోంది. ఈ గనులను అప్పగించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరింది.

దక్కన్‌ గోల్డ్‌ మైన్స్‌ కు దేశంలో వివిధ ప్రాంతాల్లో గనులు ఉన్నాయి. ఇటీవలే ఆఫ్రికాలోని మొజాంబిక్‌లో లిథియమ్‌ గనులను కొనుగోలు చేసింది. రోజుకు 100 టన్నుల లిథియం మరియు ఇతర ఖనిజాలను వెలికితీయడానికి భారీ ప్లాంట్లు నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం మరో స్థానిక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.

అదే సమయంలో, రాజస్తాన్‌లో అమ్మకానికి పెట్టిన రెండు బంగారు గనులను సొంతం చేసుకోవడానికి వేదాంతా గ్రూపు సంస్థ అయిన హిందూస్థాన్‌ జింక్‌, జిందాల్‌ పవర్‌, జేకే సిమెంట్‌ పోటీపడుతున్నాయి. రాజస్తాన్‌లోని కంక్రియా గారా గోల్డ్‌ బ్లాక్‌, భూకియా-జగ్‌పురా గోల్డ్‌ బ్లాక్‌లను ఆ రాష్ట్ర ప్రభుత్వం వేలం వేస్తోంది. తాజా వేలంలో పాల్గొనేందుకు సాంకేతిక అర్హత సాధించిన కంపెనీల్లో ఇవి కూడా ఉన్నాయి.

About The Author: న్యూస్ డెస్క్