12 సెకన్లలో 200 కోట్లు కొట్టేసిన స్టూడెంట్లు...ఏడాది తర్వాత వేర్వేరు నగరాల్లో అన్నదమ్ముల అరెస్ట్

  • నిందితులిద్దరూ సోదరులే.. పేరొందిన కాలేజీల్లో చదువుతున్నవారేనన్న పోలీసులు
  • పెండింగ్ లావాదేవీలలో మార్పులు చేసి క్రిప్టో కరెన్సీని కొట్టేశారని వివరణ

ఎంఐటీ స్టూడెంట్లు ఆంటోన్ బ్యూనో, జేమ్స్ బ్యూనో ఇద్దరూ సోదరులు. ఇద్దరికీ కంప్యూటర్ లో మంచి నైపుణ్యం ఉంది. అయితే, వారు తమ తెలివితేటలను మంచి పనులకు కాకుండా మందిని ముంచే పనులకు వాడారు. గతేడాది ఏప్రిల్ లో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పెండింగ్ లావాదేవీలను యాక్సెస్ చేసి మార్పులు చేశారు. ఆ మొత్తాలను తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు. ఇలా ఏకంగా రూ.200 కోట్లకు పైగా విలువైన డాలర్లను కాజేశారు. ఈ మోసం చాలా రోజుల తర్వాత కానీ బయటపడలేదంటే ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. అయితే, నేరం చేసి ఎక్కువ రోజులు తప్పించుకోలేరన్న మాటను నిజం చేస్తూ.. ట్రేడర్ల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు జరిగిన మోసాన్ని గుర్తించారు. 

పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు పరిశోధన చేయగా ఆంటోన్ బ్యూనో, జేమ్స్ బ్యూనో చేసిన మోసం బయటపడింది. వారి కోసం గాలింపు చేపట్టగా.. బోస్టన్ లో ఆంటోన్ బ్యూనో, న్యూయార్క్ లో జేమ్స్ బ్యూనో పట్టుబడ్డారు. ఇద్దరినీ అరెస్టు చేసి విచారించగా.. క్రిప్టో కరెన్సీ కాజేయడానికి వారిద్దరూ ఐదు నెలల పాటు ప్లాన్ చేసినట్లు బయటపడింది. నిందితులిద్దరూ తమ నేరం అంగీకరించినప్పటికీ కాజేసిన సొమ్మును తిరిగివ్వడానికి మాత్రం నిరాకరించారని పోలీసులు చెప్పారు.

About The Author: న్యూస్ డెస్క్