ఐపీఎల్ 2024లో భాగంగా నేడు ప్రేక్షకులకు రెట్టించిన ఎంటర్టైన్మెంట్ దక్కనుంది. వీకెండ్ సందర్భంగా నేడు రెండు మ్యాచులు జరగనున్నాయి. ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారిన నేపథ్యంలో ఇవాళ తలపడే నాలుగు జట్లూ కూడా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం జరిగే మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ టీమ్లు.. సాయంత్రం జరిగే మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంటళూరు-డిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి.
ఐపీఎల్ 2024లో భాగంగా నేడు రెండు కీలక మ్యాచులు జరగనున్నాయి. ప్లే ఆఫ్స్ బెర్తు కన్ఫర్మ్ చేసుకోవడమే లక్ష్యంగా నాలుగు జట్లూ కూడా నేడు అమీతుమీ తేల్చుకోనున్నాయి. పాయింట్ల పట్టికలో టాప్-2లో ప్లేసు కోసం రాజస్థాన్.. క్వాలిఫై అయితే చాలు అనే లక్ష్యంతో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్ చెన్నైలోని చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్- రాజస్థాన్ రాయల్స్ మధ్య మధ్యాహ్నం 3.30 గంటలకు జరగనుంది. రాత్రి బెంగళూరు వేదికగా జరిగే మ్యాచులో ఆర్సీబీ, ఢిల్లీ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్- రాజస్థాన్ రాయల్స్:
ఈ సీజన్లో విశేషంగా రాణించిన రాజస్థాన్ రాయల్స్.. ఆది నుంచి పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లోనే నిలిచింది. అయితే గత రెండు మ్యాచుల్లో ఓడిపోయి.. ప్లే ఆఫ్స్కు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది. నేడు చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే మ్యాచులో గెలిచే.. ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకోవాలని రాజస్థాన్ భావిస్తోంది. అటు సీజన్ ఆరంభంలో వరుస విజయాలు సాధించిన చెన్నై.. రెండో అర్థభాగంలో డీలా పడింది. కీలక పేసర్లు మతీశ పథిరన, ముస్తాఫిజుర్ రెహ్మాన్, దీపక్ చాహర్లు దూరమవడం ఆ జట్టుకు ఇబ్బంది కరంగా మారింది. ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారిన నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచులో గెలిచి నిలవాలని ఆ జట్టు పట్టుదలతో ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఇప్పటివరకు 28 మ్యాచులు జరిగాయి. అందులో సీఎస్కే 15 మ్యాచులు గెలిచి లీడ్లో కొనసాగుతోంది. అయితే గత ఏడు మ్యాచుల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆరింట్లో గెలవడం గమనార్హం. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.