మూసీ ప్రాజెక్టు వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి పునరావాసం కల్పిస్తాం: తెలంగాణ ఐటీ మంత్రి

మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు వల్ల పేదలు ఎవరూ నష్టపోకుండా చూస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్‌బాబు గురువారం పునరుద్ఘాటించారు.

తెలంగాణ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇనిస్టిట్యూట్‌లో తనను కలిసిన 20కి పైగా స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంఘాల ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు.

‘‘మూసీ ప్రాజెక్టుకు సంబంధించి అందరి ఆలోచనలు, సూచనలను గౌరవిస్తాం. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. మూసీ నదీగర్భంలో ఇళ్లు నిర్మించుకున్న వారికి పునరావాసం కల్పిస్తామన్నారు. ఎవరినీ రోడ్డు మీదకు పంపే ఉద్దేశం లేదు'' అని అన్నారు.

మూసీకి లక్ష క్యూసెక్కుల కంటే ఎక్కువ వరద వస్తే ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

‘‘మూసీ పునరుద్ధరణ, నదికి ఇరువైపులా ఉన్న పురాతన దేవాలయాలు, సాంస్కృతిక చిహ్నాలను పరిరక్షించడం ప్రభుత్వం బాధ్యత. సుందరీకరణ ప్రాజెక్టు పూర్తయితే నదీ పరివాహక ప్రాంతమంతా పర్యాటక కేంద్రంగా మారనుంది. వేలాది మంది స్థానికులకు ఉపాధి లభిస్తుందన్నారు.

About The Author: న్యూస్ డెస్క్