![కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తంగలాన్ రిలీజ్పై నిర్మాత క్లారిటీ](https://www.netipourusham.com/media-webp/c200x160/2024-07/312.png)
తెలంగాణలో పదిరోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్ల బంద్
- పదిమంది కోసం షో వేయలేం.. అందుకే బంద్
- ఓవైపు ఎన్నికలు, మరోవైపు ఐపీఎల్ తో థియేటర్ల వైపు చూడని జనం
- పెద్ద సినిమాల విడుదల వాయిదా.. చిన్న సినిమాలకు ఆదరణ కరవు
వేసవి సెలవుల్లో పెద్ద సినిమాలు ఎక్కువగా విడుదలవుతుంటాయి. సెలవుల కారణంగా థియేటర్లకు జనం ఎక్కువగా వస్తారని భావించి, మూడు గంటలు ఏసీలో సినిమా చూసి ఎంజాయ్ చేయడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. అందుకనే ఈ సమయంలో పెద్ద సంఖ్యలో సినిమాలు విడుదలవుతుంటాయి. కానీ ఈసారి పరిస్థితి మారింది. ప్రధాన నిర్మాతలు తమ సినిమాల విడుదలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నారు.
ఓవైపు దేశవ్యాప్తంగా ఎన్నికలు, మరోవైపు ఐపీఎల్ మ్యాచ్లు జరగడం వలన ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. ఈ పరిణామం సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులపై భారీ ప్రభావాన్ని చూపిస్తోంది. తెలంగాణలో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుందని థియేటర్ యజమానులు చెబుతున్నారు.
ఎన్నికలు, ఐపీఎల్ కారణంగా సినిమా చూసే జనం తక్కువగా ఉన్నారని తెలిపారు. సమ్మర్ ప్రారంభమైనప్పటి నుంచి నష్టాలు తప్పలేదని సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు వాపోతున్నారు. ఒక్కో షోకు పది, పదిహేను మంది మాత్రమే రావడం వలన, టికెట్ల ద్వారా వచ్చిన డబ్బు కరెంట్ బిల్లుకి కూడా సరిపోవడంలేదని చెబుతున్నారు. పదిమంది ప్రేక్షకుల కోసం షో వేయడం సాధ్యం కాక, రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లను పది రోజుల పాటు బంద్ చేయాలని నిర్ణయించారు.
ఈ నిర్ణయం చిన్న సినిమాల నిర్మాతలకు భారంగా మారనుందని భావిస్తున్నారు. ఈ వారంలో పలు చిన్న సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే, సింగిల్ స్క్రీన్ థియేటర్ల బంద్ కారణంగా ఈ సినిమాలు విడుదలవుతాయా లేదా వాయిదా పడతాయా అనేది చూడాలి.