![ఈవినింగ్ కాలేజీల్లో ఇంజినీరింగ్ సీట్ల కోసం భారీ పోటీ](https://www.netipourusham.com/media-webp/c200x160/2024-06/1489735638phpuhvqgz.jpeg)
హైదరాబాద్పై తీవ్ర ప్రభావం.. మెట్రో సేవలు నిలిచిపోతే నగరం ఆగమాగం
హైదరాబాద్ మెట్రో రైలును 2026 తర్వాత అమ్మకానికి పెట్టబోతున్నట్టు ఎల్ అండ్ టీ సంస్థ ప్రెసిడెంట్, శాశ్వత డైరెక్టర్, సీఎఫ్వో ఆర్ శంకర్ రామన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోనే కాదు దేశ పారిశ్రామికవర్గాల్లోనూ లోతైన చర్చ కు దారితీశాయి.
- కంపెనీల రాకపై, భూముల రేట్లపై ప్రభావం
- అటకెక్కనున్న మెట్రో కారిడార్ల విస్తరణ పనులు
- హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్పైనా నీలినీడలు
- ఐదు నెలల్లో ఎంతపనైపాయే
- నష్టాలతో నడపలేమన్న ఎల్ ఎండ్ టీ
- కాంగ్రెస్ ఫ్రీ బస్సు స్కీమే కారణం
78 ఏండ్ల చరిత్ర, రూ. 3.4 లక్షల కోట్ల ఆస్తులు, 2.25 లక్షల కోట్ల ఆదాయం, 200 వరకూ అనుబంధ కంపెనీలు, 2.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్న ‘ఎల్ అండ్ టీ’ వంటి దిగ్గజ సంస్థనే వద్దనుకొన్న ‘మెట్రో’ను ఏ కంపెనీ టేకోవర్ చేస్తుంది?
Hyderabad Metro | హైదరాబాద్, మే 11 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రైలును 2026 తర్వాత అమ్మకానికి పెట్టబోతున్నట్టు ఎల్ అండ్ టీ సంస్థ ప్రెసిడెంట్, శాశ్వత డైరెక్టర్, సీఎఫ్వో ఆర్ శంకర్ రామన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోనే కాదు దేశ పారిశ్రామికవర్గాల్లోనూ లోతైన చర్చ కు దారితీశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మహాలక్ష్మి’ స్కీమ్ కారణంగా.. మహిళలు మెట్రోల్లో ప్రయాణానికి ఆసక్తి చూపట్లేదని, దీంతో భారీ నష్టాలు వస్తున్నాయని, అందుకే అమ్మకం పెట్టాలనుకొంటున్నట్టు రామన్ కుండబద్దలు కొట్టారు.
ఎల్ అండ్ టీ తప్పుకొంటే ఎలా?
కాంగ్రెస్ ‘ఫ్రీ’ బస్సు స్కీమ్ కారణంగా నష్టా ల్లో కూరుకుపోతున్న హైదరాబాద్ మెట్రో రైలు ను నడుపలేమని ఎల్ ఎండ్ టీ తేల్చిచెప్పింది. 65 ఏండ్లపాటు పలు రాయితీలు ఉన్నప్పటికీ.. అమ్మకానికే తమ ప్రాధాన్యమని కుండబద్దలు కొట్టింది. ఒకవేళ మెట్రో రైలు నిర్వహణ నుంచి ఎల్ అండ్ టీ తప్పుకొంటే మరేదైనా ప్రైవేటు కంపెనీ మెట్రో బాధ్యతలను స్వీకరిస్తుందా? అంటే సమాధానం లేదు. దీనికి కారణం లేకపోలేదు. 78 ఏండ్ల చరిత్ర కలిగి, రూ. 3.4 లక్షల కోట్ల ఆస్తులు, రూ. 2.25 లక్షల కోట్ల ఆదా యం, 200 వరకూ అనుబంధ కంపెనీలు, 2.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్న ‘ఎల్ అండ్ టీ’ వంటి సంస్థనే చేతులెత్తేస్తే ‘హైదరాబాద్ మెట్రో’ ను మరో కంపెనీ టేకోవర్ చేసే అవకాశాలు తక్కువని అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వం టేకోవర్ చేస్తుందా?
దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లో మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. ఢిల్లీ, ముం బై, కోల్కతా, చెన్నై, బెంగళూరులోని సర్వీసులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు (కొన్ని చోట్ల కేంద్రం భాగస్వామ్యంతో) నిర్వహిస్తుండగా.. హైదరాబాద్ మెట్రో మాత్రం పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం) పద్ధతిన నడుస్తున్నది. ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలో 90 శాతం వాటా ఎల్ ఎండ్ టీకి ఉండగా, మిగతా 10 శాతం రాష్ట్ర ప్రభుత్వానిది. ఒకవేళ, ప్రాజెక్టు నుంచి ఎల్ ఎండ్ టీ తప్పుకొంటే, ఇతరత్రా ఏ కంపెనీ ప్రాజెక్టు టేకోవర్కు ముందుకు రాకుంటే.. మొత్తం మెట్రోను నడపడానికి ప్రభుత్వమే ముందుకు వస్తుందా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
మెట్రో నిలిచిపోతే ట్రాఫిక్ నరకం
1.3 కోట్ల జనాభా ఉన్న హైదరాబాద్లో దా దాపు 90 లక్షల వ్యక్తిగత వాహనాలు ఉన్నాయి. మెట్రో సర్వీసులు రావడంతో ఉద్యోగులు, సామాన్యులు వ్యక్తిగత వాహనాలను పక్కనబెట్టి మెట్రోలో ప్రయాణించారు. ట్రాఫిక్ కష్టాలు కొంతవరకూ తగ్గాయి. ఒకవేళ,మెట్రో సర్వీసు లు ఆగిపోతే, ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగొచ్చు.
కంపెనీల రాకపై ప్రభావం
నగరంలో పెట్టుబడులు పెట్టాలంటే ప్రతీ కంపెనీ ఆలోచించే ప్రాథమిక అంశం రవాణా సాధనాలు. ఉద్యోగులు ప్రయాణంలో అలిసిపోతే ఉత్పాదకతపై ప్రభావం చూపిస్తుంది. ఈ విషయాన్ని కంపెనీలు ప్రధానంగా తీసుకొంటాయి. రీజినల్ కనెక్టివిటీని కూడా విశ్లేషిస్తాయి. రవాణా సౌకర్యం మెరుగ్గా ఉన్న నగరాలకే సంస్థ లు వరుసకడతాయి. నగరంలో మెట్రోసేవలు నిలిచిపోతే, కంపెనీల రాకపై ప్రభావం పడొచ్చు.
భూముల రేట్లు పడిపోయే ప్రమాదం
మెట్రో కారిడార్, స్టేషన్లు ఉన్న పరిధిలో భూముల రేట్లు బాగా పెరిగాయి. ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ దీనికి ఒక కారణమైతే, స్టేషన్ల దగ్గర మాల్స్ ఏర్పాటు చేయడం మరో కారణం. ఒకవేళ, నగరంలో మెట్రో సర్వీసులు నిలిచిపోతే, భూముల రేట్లు అమాంతం పడిపోవచ్చు.
కాలుష్యం పైపైకి.. అటకెక్కనున్న విస్తరణ
హైదరాబాద్లో ప్రస్తుతం కరెంటు ఆధారిత మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. ఈ సేవలు నిలిచిపోతే, ప్రజలు వ్యక్తిగత వాహనాల వైపునకు మళ్లొచ్చు. దీంతో వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. మెట్రో సేవలు నిలిచిపోతే.. ప్రతిపాదిత మెట్రో కారిడార్ల విస్తరణ ప్రణాళికలు అటకెక్కుతాయి.
హైదరాబాద్ బ్రాండ్పై నీలినీడలు
దేశంలో తొలి మెట్రో రైలు కలకత్తాలో 1984లోనే ప్రారంభమైంది. 33 ఏండ్ల తర్వాత మనదగ్గర సేవలు మొదలయ్యాయి. మెట్రో సేవలు మళ్లీ నిలిచిపోతే.. టెక్, ఫార్మా, హాస్పిటాలిటీ రంగాలకు దిక్సూచీగా మారిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. పారిశ్రామికవేత్తలు, పర్యాటకులు నగరంవైపు చూసే పరిస్థితి ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు.
‘మెట్రో రైలు’లేని హైదరాబాద్ను ఓసారి ఊహించుకోండి!ఎందుకంటారా?? దేశంలోనే అతిపెద్ద బహుళజాతి సంస్థల్లో ఒకటైన ఎల్ అండ్ టీ సంస్థ.. తాము హైదరాబాద్ మెట్రోను నడపలేం బాబోయ్ అని చేతులెత్తేసింది మరి.
‘ఫ్రీ’ బస్సు స్కీమ్తో మెట్రోకు నష్టాలు వస్తున్నాయని, దీంతో మెట్రోను అమ్మేయాలనుకొంటున్నట్టు ఎల్ అండ్ టీ సంస్థ ప్రెసిడెంట్ ఆర్ శంకర్ రామన్ స్వయంగా ప్రకటించారు.